ప్రతి కాలేజీ నుంచి 10 మందికి చాన్స్
ఈ ఏడాది అందుబాటులోకి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థులలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలోని 100 ప్రభుత్వ కాలేజీల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (ఈడీ) కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ విద్యా సంవత్సరంలో ఈడీ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు తెలియచేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ సైంటిస్ట్ పేరుతో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ప్రత్యేక ల్యాబుల్లో ప్రయోగాలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి డిగ్రీ కాలేజీలో ఈడీకి సంబంధించిన కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి డిగ్రీ కాలేజీ నుంచి కనీసం 10 నుంచి 20 వరకు విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుచేసి, వారితో స్టార్టప్స్ ఏర్పాటు చేయించే విధంగా కళాశాలల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ కృషి చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రతిభావంతులై డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కొన్ని పరిశ్రమలు ముందుకు వచ్చాయి. ప్రత్యేక ఈడీ బృందంతో వారికి నిత్యం శిక్షణ ఇప్పిస్తారు. అందుకోసం అవసరమయ్యే ఖర్చును రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల నుంచి సేకరిస్తున్నారు.