ED | ముంబై, మార్చి 28: మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వచ్చే బుధవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులో రూ.6.37 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు కేసు నమోదైంది. దీనికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్లో అమోల్ను ఆర్థిక నేరాల విభాగం అధికారులు ప్రశ్నించారు.
అనంతరం పీఎంఎల్ఏ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసి ఆదిత్య ఠాక్రే సన్నిహితుడైన సూరజ్ చవాన్ను అరెస్ట్ చేసింది. ఇప్పుడు అదే కేసులో అమోల్ కృతికర్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం ఇవ్వాలని అమోల్ కృతికర్ న్యాయవాది ఈడీ అధికారులను గురువారం కలిసి అభ్యర్థించారు.