ముంబై, ఫిబ్రవరి 9: శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేయకపోతే జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. తనను, తన కుటుంబసభ్యులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కేసులో ఇరికించాలని తమ బాస్లు తమను కోరారని అధికారులే స్వయంగా తనతో పేర్కొన్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మంగళవారం లేఖ రాశారు. లేఖను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అనంతరం ‘ఇది ముంబై. శివసేన ముంబైకి దాదా. ఎన్నటికీ తలవంచబోదు’ అని పేర్కొంటూ పార్టీ గుర్తైన పులిని రౌత్ ట్వీట్ చేశారు. ఏదిఏమైనా ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తి చేసుకొంటుందని స్పష్టం చేశారు.
లేఖలో రౌత్ ఏం చెప్పారంటే?
‘నెల క్రితం కొంతమంది వ్యక్తులు నన్ను సంప్రదించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం కూల్చడానికి సాయం చేయాలన్నారు. నేను ఒప్పుకోలేదు. వాళ్లు బెదిరించారు. రైల్వే మాజీ మంత్రి (లాలూ)కి పట్టిన గతే నాకు పడుతుందన్నారు. నాతోపాటు మహారాష్ట్ర క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు కీలక నేతలపై మనీలాండరింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామన్నారు. కీలక నేతలందరూ జైళ్లకు వెళ్తే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు అవే వస్తాయని చెప్పారు’ అని రౌత్ లేఖలో పేర్కొన్నారు.