చండీగఢ్: ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈడీ దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది. ఎనిమిది గంటలపాటు విచారించిన తర్వాత గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత మొహాలీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీపై ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 18న భూపిందర్ సింగ్ ఇంటితోపాటు మరో పదిచోట్ల దాడులు నిర్వహించింది. ఇందులో భూపిందర్ ఇంట్లో రూ.7.9 కోట్లు, అతని సహచరుడు సందీప్ కుమార్, కుద్రదీప్ సింగ్ ఇండ్లలో రూ.2 కోట్లు సీజ్ చేసింది. ఈ ముగ్గురు ప్రొవైడర్స్ ఓవర్సీస్ సర్వీసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ఈడీ గుర్తించింది. దీంతో వారిపై అక్రమ మైనింగ్ వ్యవహరంలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
#WATCH | Punjab CM Charanjit Singh Channi's nephew Bhupinder Singh Honey arrested by Enforcement Directorate (ED) from Jalandhar on Thursday evening following day-long questioning in an illegal sand mining case: Sources pic.twitter.com/6ciwmY1mhX
— ANI (@ANI) February 4, 2022
కాగా, ఎన్నికల ముందు సీఎం చన్నీ మేనల్లుడిని ఈడీ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమయింది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.