ఇప్పటికే యాదాద్రి దేవస్థానంలోని గోశాల నుంచి సేకరించిన ఆవుపేడ, స్వామి వారికి అలంకరించిన గులాబి, చామంతి, తులసి తదితర నిర్మాల్యంతో సహజ సిద్ధమైన అగరొత్తులను తయారు చేస్తున్నారు యాదగిరిగుట్ట, ఆలేరుకు చెందిన వాగ్మి మహిళా గ్రూప్ సభ్యులు. అక్కడితో ఆగకుండా.. విద్యా సంస్థలలో చెత్తబుట్టపాలైన కాగితాలు, పాత దినపత్రికల నుంచి ఎకో ఫ్రెండ్లీ పేపర్ పెన్సిళ్లు, పెన్నుల తయారీకి శ్రీకారం చుట్టారు. వీటిని ‘లయన్-ఈ’ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని సంకల్పించారు. వీరి ఉత్సాహానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలేరు తాసీల్దార్ రామకృష్ణ ప్రోత్సాహం తోడైంది.
గుజరాత్ నుంచి రూ. 1.50 లక్షల విలువైన యంత్రాలను కొనుగోలు చేశారు. నిపుణుల ద్వారా సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. రోజూ 8 నుంచి 10 వేల పెన్నులు, పెన్సిళ్లు తయారు చేసే వీలుంది. దీనివల్ల నెలకు రూ. 2 లక్షల ఆదాయం సమకూరనుంది. వీటిని కొనుగోలు చేసేందుకు విద్యా సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు, ఈ మహిళలు యాదాద్రి జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాల కోసం దీపారాధన ఒత్తులనూ తయారు చేస్తున్నారు. రోలింగ్ మెషీన్తో నిత్యం 3 కేజీల ఒత్తులు సిద్ధం అవుతున్నాయి. వంద ఒత్తులతో కూడిన ప్యాకెట్లు విక్రయానికి తరలిస్తున్నారు. ‘వాగ్మి మహిళల సంకల్పం చాలా గొప్పది. ఆలేరులో వీరి కోసం ఒక కాల్సెంటర్ కూడా సిద్ధం చేశాం’ అంటారు గొంగిడి సునీతా మహేందర్రెడ్డి. ‘మేం తయారు చేసిన పెన్సిళ్లు, పెన్నులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విక్రయిస్తాం’ అని వివరిస్తారు సంఘం సభ్యురాలు బింగి అన్నపూర్ణ.
– తండ జహాంగీర్గౌడ్