హైదరాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల తుదిఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాష్ట్రంలో 12 స్థానాలకు గానూ హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 9,802 అర్హులైన ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. 12 స్థానిక సంస్థల శాసనమండలి స్థానాల ఎన్నికలకు మంగళవారం ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
డిసెంబర్ 10న ఎన్నికలు, 14న కౌంటింగ్ జరుగనున్నది. స్థానిక సంస్థల శాసనమండలికి జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఓటర్లు కాగా, మహిళలు 4,343 మంది, పురుషులు 5,459 మంది ఉన్నారు. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 1,445 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా ఖమ్మం జిల్లాలో 768 మంది ఉన్నారు. వీరి కోసం 65 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు.
జడ్పీటీసీ సభ్యులు 570, ఎంపీటీసీ 5,705 , కౌన్సిలర్లు 2,798, కార్పొరేటర్లు 611 మంది ఓటు వేయనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న బలం దృష్ట్యా అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.