న్యూఢిల్లీ, మార్చి 27: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథేలకు ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి వ్యాఖ్యలు అగౌరవంగా, దురుద్దేశంతో కూడుకుని ఉన్నాయని ఈసీ వ్యాఖ్యానించింది.
ప్రాథమిక ఆధారాలను బట్టి వీరిద్దరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని స్పష్టమవుతున్నదని పేర్కొంది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది. ఎన్నికల సందర్భంగా ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.