ముంబై, ఏప్రిల్ 11: విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సొల్యూషన్స్ కంపెనీ మెజెంటా.. యూలెర్ మోటర్స్ సహకారంతో హైదరాబాద్లో ఈ-కార్గో బండ్లను తేవాలని చూస్తున్నది. రాబోయే నెలల్లో హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో 1,000 త్రీ-వీలర్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో 100 ఈవీఈటీ ఈ-కార్గో త్రిచక్ర వాహనాలు ఇరు సంస్థల భాగస్వామ్యంలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించాలని మెజెంటా ప్రయత్నిస్తున్నది. కాగా, ఈవీఈటీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మెజెంటాకు చెందినవే. ఇక యూలెర్.. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను తయారు చేస్తున్నది. 688-కేహెచ్ సామర్థ్యంగల ఈ-కార్గో త్రీవీలర్ హిలోడ్ను మార్కెట్లో విక్రయిస్తున్నది. ‘ఎలక్ట్రిక్ ఫ్లీట్ యాజ్ ఏ సర్వీస్’ విధానం కింద ఈ-కామర్స్, ఫార్మా, ఫుడ్ డెలివరీ ఇతరత్రా రంగాల్లో సేవలందిస్తున్నట్టు ఓ ప్రకటనలో మెజెంటా తెలియజేసింది. ఇదిలావుంటే దేశంలో ఈవీల కోసం చార్జింగ్ సదుపాయాలనూ సంస్థ కల్పించాలనుకుంటున్నది. హెచ్పీసీఎల్ నుంచి ఆర్థిక దన్ను, మైక్రోసాఫ్ట్ నుంచి సాంకేతిక సాయం మెజెంటాకు అందుతున్నది.