Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం అతడికి జట్టులో అవకాశం కల్పించే విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మోర్కెల్.. జట్టు ప్రస్తుతం విజయవంతమైన కాంబినేషన్తో కొనసాగుతోందని, అందువల్ల టాప్ ఆర్డర్లో మార్పులు చేసే ఆలోచన లేదని తెలిపారు. ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారని మోర్కెల్ గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో జట్టు విజయాల్లో వీరి పాత్ర కీలకమైందని, మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లపై విశ్వాసం ఉంచడం కోచింగ్ స్టాఫ్ బాధ్యత అని చెప్పారు.
సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన మోర్కెల్.. అతడు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేశాడని, అలాగే ఐపీఎల్లో కూడా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడని అన్నారు. యువ ఆటగాళ్లు అవకాశాల కోసం వేచి ఉండటం సహజం. కానీ జట్టు ఎంపికలో ఒక ఆటగాడి గురించే కాకుండా, మొత్తం జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు. అయితే వైభవ్ సూర్యవంశీ సామర్థ్యంపై మోర్కెల్ ప్రశంసలు కురిపించారు. నెట్స్లో అతడికి తానే స్వయంగా బౌలింగ్ వేసినట్లు వెల్లడించిన ఆయన, ఈ యువ బ్యాటర్ ప్రతిభ తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. చిన్న వయసులోనే వైభవ్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో కలిసిపోవడం సానుకూల అంశమని, భవిష్యత్తులో అతడికి అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను నిరూపించుకునే సామర్థ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్, ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇప్పుడు ఇరు జట్ల దృష్టి రెండో మ్యాచ్పైనే ఉంది. జులై 4న మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్తో బరిలోకి దిగనుండగా, వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్లో అవకాశం లభించే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. అయితే భవిష్యత్తులో అతడికి అవకాశాలు తప్పకుండా వస్తాయని టీమ్ మేనేజ్మెంట్ సంకేతాలు ఇచ్చినట్లు మోర్కెల్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.