అమరావతి : దొరగా వచ్చి దొంగతనం చేసే వ్యక్తులు కొందరైతే మాయమాటలు చెప్పి మూట, ముళ్లే సర్దుకుపోయేటోళ్లు మరికొందరు. తాజాగా కడప జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన దొంగతనాల్లో నిందితుడిని పట్టుకుని విచారించగా పలు ఆసక్తికర విషయాలను పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి బంధువుల ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి.
బాధితుల ఫిర్యాదుతో ఆస్పత్రిపై కన్నేసిన పోలీసులు చివరకు ఓ నకిలీ వైద్యుడిని గుర్తించి కటకటాలపాలు చేశారు. మణిదీప్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా నకిలీ వైద్యుడిగా అవతారమెత్తి ఆస్పత్రిలో ఎవరికీ అనుమానం రాకుండా సంచరిస్తున్నాడు. అమాయక రోగులకు మత్తుమందు ఇచ్చి వారు నిద్రలోకి జారుకోగానే వారి వద్ద ఉన్న బంగారు నగలతో పాటు చేతికందిన నగదు, వస్తువులను దొంగిలించి అక్కడి నుంచి పారిపోవడం పరిపాటిగా పెట్టుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో చివరకు పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకుని విచారించగా రోగుల వద్ద చోరీల విషయాన్ని ఒప్పుకున్నాడు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పట్టుకున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.