న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాతో పాటు యావత్ ప్రపంచం కూడా కరోనాపై పోరాటం చేస్తోందన్నారు. కోవిడ్ మొదలైన సమయంలో.. ఇండియా ఏమౌతుందని అందరూ చర్చించారని, ఇండియా వల్ల ప్రపంచంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో అని కూడా ఆందోళన చెందారని, కానీ 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ.. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఐటీ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు ఆయన చెప్పారు.
తొలి లాక్డౌన్ సమయంలో సుదీర్ఘ చర్చల తర్వాత చాలా కీలకమైన, ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్డౌన్ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. అది చాలా కీలకమైన నిర్ణయమన్నారు. దాని ఫలితంగా రికార్డు స్థాయిలో రైతులు పంటను పండించినట్లు మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి వేళ యువత దేశం గర్వపడేలా చేశారని, క్రీడా రంగంలో యువత రాణించినట్లు ఆయన తెలిపారు. మహమ్మారి ప్రభావం క్రీడలపై పడకుండా చూశారన్నారు. క్రీడాకారులు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చినట్లు చెప్పారు.