హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ-హబ్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా చిరుధాన్యాలతో పానీయం (మల్టీమిల్లెట్ ప్రొటీన్ షేక్) తయారవుతున్నది. దీనిని తయారుచేస్తున్న మిల్లెట్బౌల్ అనే స్టార్టప్ కంపెనీకి టీ-హబ్ సంస్థ టీ-ఫండ్ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేసింది. దీనితోపాటు పర్స్పెక్ట్ ఏఐ స్టార్టప్కు రూ.కోటి, లౌరికో స్టార్టప్కు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేసినట్టు టీ హబ్ సీఈవో ఎమ్మెస్ రావు సోమవారం తెలిపారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో మిల్లెట్లపై పరిశోధనలు చేసినట్టు మిల్లెట్బౌల్ వ్యవస్థాపకుడు కేఆర్ సంజయ్కుమార్ తెలిపారు. చిరుధాన్యాలతో మొత్తం పది రకాల ఉత్పత్తులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. తల్లిపాలు, ఈత, కొబ్బరిలో లభ్యమయ్యే లారిక్యాసిడ్ తరహా పదార్థాన్ని స్టార్టప్ సంస్థ లారికో రూపొందించింది. ఇదిలావుంటే లారిక్షాట్స్ పేరుతో రూపొందించిన తమ ఉత్పత్తులకు అమెరికా నుంచి సర్టిఫికెట్ లభించిందని లారికో వ్యవస్థాపక సభ్యురాలు సుంకరి లావణ్య ఈ సందర్భంగా తెలియజేశారు.