హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ రఘురాంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్’ నిర్వహించిన 107వ వార్షిక సదస్సులో డాక్టర్ రఘురాం బుధవారం కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్యుల సదస్సుగా పిలిచే ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీతో సహా మొత్తం 11 మంది ఉపన్యసించారు. ఇందులో 10 మంది అమెరికా పౌరులు కాగా, డాక్టర్ రఘురాం మాత్రమే అమెరికాయేతర వ్యక్తిగా అరుదైన గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం దాదాపు 55 నిమిషాలు ప్రసంగించారు. రొమ్ము క్యాన్సర్ల చికిత్సకు సంబంధించి తాను భారత్-బ్రిటన్ మధ్య అనుసంధానకర్తగా ఉన్నానని చెప్పారు. బ్రిటన్లో వైద్యుడిగా ఉన్న సమయంలో తన తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో, ఆమెకు చికిత్స అందించేందుకు 14 ఏండ్ల కిందట భారత్కు వచ్చానని తెలిపారు. బ్రిటన్లో అనుసరిస్తున్న ఉత్తమ వైద్యవిధానాలను తెలుసుకొని, వాటిని భారత్లో అమలు చేస్తున్నానని వివరించారు. వాటిని మరింత మెరుగుపరిచి కొత్త పద్ధతులను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రారంభదశలోనే క్యాన్సర్లను గుర్తించగలిగితే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.