ఘట్కేసర్, జనవరి 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన లబ్ధిదారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, అర్హులకు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఇందుకోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న స్థానిక కుటుంబాలను రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేశారని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఘట్కేసర్ తాసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ మున్సిపాలిటీలో 1889 మంది డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు 314 మందిని అర్హులుగా గుర్తించారని పేర్కొన్నారు. అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కమిషనర్ వసంత, డిప్యూటీ తాసీల్దార్ భాస్కర్రెడ్డి, ఆర్ఐ అలేఖ్య, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.