తిరుమల/హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ముగిశాయి. గుండెపోటుతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు. శేషాద్రి సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేరుగా తిరుపతిలోని డాలర్ శేషాద్రి నివాసానికి చేరుకొని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు కంచి పీఠం తరపున వచ్చిన ప్రతినిధులు డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు కూడా పార్థీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అంతిమయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కరుణాకర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి శేషాద్రి పాడెమోశారు.
డాలర్ శేషాద్రితో 25 ఏండ్ల అనుబంధమున్నది. ఆయన లేని తిరుమలను ఊహించుకోలేకపోతున్నా. శ్రీవారి సేవలోనే తుదిశ్వాస విడవటం శేషాద్రి అదృష్టం. స్వామివారికి శేషాద్రి అత్యంత ప్రియ భక్తుడు. తిరుమల వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో పలకరించి స్వామివారి దర్శనం చేయించేవారు. ఇకపై అలాంటి ఆహ్వానం ఉండదనేది నా మనసును కలిచివేస్తున్నది. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబసభ్యులకు ఎంతో నష్టం. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలి. శ్రీవారు ఆయనకు ముక్తిని ప్రసాదించాలి. ఆలయ సంప్రదాయాలపై శేషాద్రి రచించిన పుస్తకాలను టీటీడీ వినియోగించుకోవాలి.- మీడియాతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహం వద్ద మంగళవారం నివాళులు అర్పిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. శేషాద్రి అంతిమ సంస్కారాలు తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠ ప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు.