మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న దగాకోరు పార్టీ బీజేపీ అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మేడ్చల్ జిల్లాలో రైతులకు మద్దతుగా వేలాది మందితో మహాధర్నాలను నిర్వహించారు. మహాధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ పార్టీ నాశనమవుతుందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు పొం తన లేకుండా మాట్లాడుతున్నారని, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంచే యాసంగిలో వడ్లు కొంటామన్న ఉత్తర్వులను తీసుకురావాలని మంత్రి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని, తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని మంత్రి హెచ్చరించారు. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్..
రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారని, ఈ ఘనత సీఎంకు దక్కుతుందని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంతోపాటు రైతు బంధు, రైతు బీమా పథకం ప్రవేశపెట్టి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న విషయం రైతులందరికీ తెలుసునని తెలిపారు. ఈ ధర్నాలో మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, మేయర్లు జక్కా వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మున్సిపల్ చైర్మన్లు కొండల్రెడ్డి, పావనీ జంగయ్య యాదవ్, చంద్రారెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, ఎం పీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
జిల్లాలో విజయవంతమైన మహాధర్నా..
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి మహాధర్నాలను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట్లో జరిగిన ధర్నాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ధర్నా గండిమైసమ్మ వద్ద జరిగింది. ధర్నా విజయవంతం కావడంతో బీజేపీ నాయకుల్లో వణుకు మొదలైందని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు.