సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 6 : యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి కొనుగోలు కేంద్రంతో పాటు నంగునూరు మండల పరిధిలోని ముండ్రాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్, డీఎస్వో హరీశ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ మేరకు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తూ పోస్టర్, బుక్లెట్లు ఆవిష్కరించారు. అంతకు ముందు ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లులకు తరలించే వరకు జరుగుతున్న ప్రక్రియను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా రైతులనే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని సృష్టం చేశాయన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. ఒక వేళ మిల్లర్లతో ముందస్తు ఒప్పందం, విత్తన ఉత్పత్తి కోసం, బయట అమ్ముకునే వాళ్లు, తింటామని అనుకునే వారుమాత్రమే వరిసాగు చేసుకోవచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు. వరికి బదులు కూరగాయలు, నువ్వులు, పెసర్లు, మినుములు, పొద్దుతిరుగుడు, పట్టు పరిశ్రమ, ఆయిల్పామ్ లాంటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. ఈ మేరకు పలువురు రైతులు కోతులు, అడవి పందుల బెడద ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మండల వ్యవసాయాధికారి పరశురాంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.