నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణకు కేంద్రం నిరాకరిస్తున్నందున రైతులు యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు. నిర్మల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇతర పంటలు వేయాలని సూచించారు.
కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామని ఒప్పించకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు ఊర కుక్కల్లా మొరుగుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. బుధవారం దేవరకొండలో జరిగిన నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడేండ్లుగా రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, సాగునీరు, కరెంటు కోసం రైతులు రోడ్లపై ధర్నాలు చేసిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. పార్లమెంటులో తెలంగాణ రైతుల కోసం గళం విప్పని జిల్లా ఎంపీ ఉండి నిరుపయోగమని విమర్శించారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు తీసుకొచ్చిన నల్లచట్టాలతోనే 750 మంది రైతులు చనిపోయారని, ఆ రైతుల చావులకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత కదా? అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వ పెద్దలను, బీజేపీ నేతలను నరహంతకులు అనడంలో తప్పేమీ లేదన్నారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ధాన్యానికి ఎంఎస్పీ ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. రాష్ట్ర రైతాంగం సీఎం కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు బురదజల్లే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో రైతు ద్రోహిగా బీజేపీ వ్యవహరిస్తున్నది. కేంద్రం ప్రభుత్వం ధాన్యం సేకరణ అంశాన్ని ప్రకటించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. రాష్ట్ర రైతాంగం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీకి చీమకుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి తెలంగాణ రైతులను ఆదుకోవాలి.
రమేశ్, మంగ్లూర్, కామారెడ్డి జిల్లా
నేను 20 ఏండ్ల సంది ఎవుసం చేత్తాన్న. వానకాలం, యాసంగిలో నా సొంత పొలం కలుపుకొని ఇంకింత కౌలుపట్టి వడ్లు పండిత్తాన్న. వడ్లు అమ్ముకునేటప్పుడు ఎన్నడూ ఇసొంటి ఆగం కథ లేకపోయేది. తెలంగాణ సర్కార్ అచ్చినంక ఎవుసం జర అలుకగైంది. ఇప్పుడు యాసంగి వడ్లు కొనమని బీజేపోళ్లు చెప్పుడు మంచిగలేదు. పంజాబ్ కాడ వడ్లు కొంటాండ్లట. మనకాడ కూడా వడ్లుకొని రైతులకు సాయం చేయాలె. కేసీఆర్ సార్కు అన్ని పార్టీలోల్లు సపోర్టుగా నిలబడి వడ్లు కొనేదాక ఢిల్లీ సర్కార్ ఎంబడి వడాలె. రైతులందరు రోడ్లు ఎక్కకముందే ఎనుకటి లెక్కనే ఏ లొల్లి లేకుండా యాసంగిలో కూడా వడ్లు కొనాలె.
-పెద్దోజు శంకర్, రైతు, పాల్సాబ్పల్లి, ములుగు జిల్లా