హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ ఎంపీలకు దమ్ముంటే తెలంగాణలోని ఏదైనా ప్రాజెక్టుకు జాతీ య హోదా తీసుకురాగలరా? అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీ య హోదా తీసుకొస్తామని చెప్పే ధైర్యమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో 2022-23 వార్షిక బడ్జెట్పై బుధవారం జరిగిన చర్చలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. గుజరాత్ కంటే తెలంగాణ మించిపోయిందన్న దుగ్ధ, అసూయతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షకట్టిందని ధ్వజమెత్తారు. విభజన హామీలను ఉద్దేశపూర్వకంగానే కేంద్రం పక్కన పెట్టి రాష్ర్టానికి తీవ్రద్రోహం తలపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని కేంద్రం పక్కన పెట్టడం కక్షసాధింపు కాదా? అని నిలదీశారు. రాష్ర్టానికి ఒకవైపు అన్యాయం చేస్తూనే, మరోవైపు తెలంగాణ ఆవిర్భావాన్ని తప్పుపట్టేలా, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని మోదీ, ఆ పార్టీ అగ్రనాయకుడు అమిత్ షా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. కేంద్రం కక్ష సాధింపు, వివక్ష రాష్ట్రంపై కాదని.. తెలంగాణ ప్రజలపైనేనని సుమన్ వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటి రెండింటిని సంపూర్ణంగా సాధించుకొన్నామని, నియామకాలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరినట్టేనని సుమన్ అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్షా 33 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. స్థానికులకు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ జరగాల్సి ఉం డటంతో మిగతా ఉద్యోగాల భర్తీకి జాప్యం జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయాన్ని కేంద్రం పక్కన పెట్టి తాత్సారం చేయడంతో ఉద్యోగాల ను పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. కేంద్రంపై పోరాటం చేసి ఎట్టకేలకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించుకురావడంతో కనీవినీ ఎరగని రీతిలో ఉద్యోగాల నియామకాల భర్తీని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వందశాతం నెరవేరుతున్నాయని తెలిపారు. నాటి ఉస్మానియా వర్సిటీ విద్యార్థిగా, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని వెల్లడించారు. ఉద్యమ ఆకాంక్షలు మాత్రమే కాకుండా, కాళేశ్వరం, మిషన్ భగీరథ, దళితబంధు వంటి విప్లవాత్మక, వినూత్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని అడిగారు.