సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆరేండ్లుగా ఎంతోమంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఉమెన్ ఎనర్జీ సంస్థ ప్రస్తుతం దివ్యాంగ మహిళలపై దృష్టి సారించింది. వారికి చేదోడువాదోడుగా నిలిచేందుకు సిద్ధమైంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఉమెన్ ఎనర్జీ సంస్థ దివ్యాంగ మహిళలకు విభిన్న రంగాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నది. ఇప్పటి వరకు 30 మంది దివ్యాంగ మహిళలకు శానిటరీ ప్యాడ్స్, నాప్కిన్స్ ఉత్పత్తి చేయడంలో ఉచిత శిక్షణ అందించడంతో పాటు వారు తయారు చేసిన 50 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేసింది. మిగిలిన వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు మెళకువలు నేర్పించింది. మొత్తంగా దివ్యాంగ మహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నది ఈ సంస్థ.
ఉమెన్ ఎనర్జీ సంస్థ లెక్కల ప్రకారం భారతీయ మార్కెట్లో శానిటరీ ప్యాడ్స్ వ్యాపారం విలువ రూ.35 వేల కోట్లు. ప్రతి సంవత్సరం ఇది 11 శాతం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పర్యావరణానికి హాని లేకుండా భూమిలో కలిసిపోయే పదార్థాలతో నాప్కిన్స్ తయారు చేయాలని నిశ్చయించుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా నాప్కిన్స్ను యంత్రాల మీద తయారు చేస్తారు. వాటి విలువ కోటి నుంచి రెండు కోట్లు ఉంటుంది. ఇలాంటి ఉత్పత్తిని మల్టీనేషనల్ కంపెనీలు మాత్రమే చేయగలవు.
అదే బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ను కొత్తగా వచ్చిన యంత్రాలతో తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. ఇంటివద్దే ప్యాకెట్కు 8 చొప్పున రోజుకు 800 నాప్కిన్స్ తయారు చేయవచ్చు. ఇతరులకు సైతం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఆసక్తిగల దివ్యాంగ మహిళలు 9154222503, 9154222501, 9154833108 నంబర్లలో సంప్రదించొచ్చు.
వైకల్యాన్ని తలుచుకుని తల్లడిల్లే రోజులు పోయాయి.
స్వశక్తితో ఎదిగి నలుగురికి ఉపాధిని చూపి ఆదర్శంగా నిలవాల్సిన తరుణం ఇది. మేము జాలి కోరుకోవడం లేదు.. మంచి సలహా కోసం చూస్తున్నాం. మా కాళ్ల మీద మేం నిలబడి ధైర్యంగా ఉండాలని భావిస్తున్నాం. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం. మేం వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఉమెన్ఎనర్జీ సంస్థకు రుణపడి ఉంటాం… అంటూ దివ్యాంగ మహిళా వ్యాపారవేత్తలు చెబుతున్నారు.