భీంపూర్, ఫిబ్రవరి 6: కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులతో కలిసి 50 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముగ్గురికి షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకాలకు తోడుగా తులం బంగారం కూడా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిదాస్, డీఈ శివరాం, ఆర్ఐ అశోక్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు మడావి లింబాజీ, బాదర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు నరేందర్యాదవ్, జహూర్అహ్మద్, సంజీవ్రెడ్డి, ధరమ్సింగ్, జాదవ్ రవీందర్, ఆకటి నరేందర్రెడ్డి, అనిల్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చట్ల ప్రవీణ్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ కొండ గోవర్ధన్ మంగళవారం నేరడిగొండలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి, అవసరమున్న చోట కొత్తవి నిర్మించాలని, స్కావెంజర్లను నియమించాలని కోరారు. ప్రతి కళాశాలకు ప్రహరీ నిర్మించేలా చూడాలని కోరారు. ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి నర్సయ్య, రాజేశ్వర్ ఉన్నారు.
పరామర్శ
భీంపూర్, ఫిబ్రవరి 6 : నిపాని గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ షేక్ కాశీం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాశీం మృతి గురించి వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుచ్చారు. వెంటనే ఆయన నిపానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కేమ రాజన్న, మార్సెట్టి అనిల్, నారాయణరెడ్డి ఉన్నారు.
క్షతగాత్రులకు..
తాంసి(తలమడుగు), ఫిబ్రవరి 6 : చెర్లపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడి గాయపడ్డ క్షతగాత్రులను బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పరామర్శించారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని తెలిపారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు అభిరాంరెడ్డి, అనిల్ అన్న యువసైన్యం కార్యకర్తలు ఉన్నారు.