న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ సతీమణి మాధురి జైన్ గ్రోవర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కంపెనీ ఉద్వాసన పలికింది. మాధురి సంస్థ కంట్రోల్స్ హెడ్గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ సొమ్మును బ్యూటీ ట్రీట్మెంట్లు, విదేశీ టూర్లకు ఖర్చుచేసి, నకిలీ ఇన్వాయిస్లు సమర్పించాన్నది కంపెనీ ప్రధాన ఆరోపణ. అలాగే మాధురి జైన్కు కేటాయించిన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను కూడా రద్దు పర్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే అష్నీర్ గ్రోవర్ను కంపెనీ బోర్డు మూడు నెలల సెలవుపై పంపించింది. అటుతర్వాత మాధురి సైతం సెలవుపై వెళ్లారు. వివిధ కొనుగోళ్లు, ఖర్చులకు సృష్టించిన నకిలీ బిల్లులను కంపెనీ ఫైనాన్షియల్ ఇన్-ఛార్జ్గా ఉన్న మాధురియే ఆమోదించేవారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం మాధురి జైన్ గ్రోవర్ సర్వీసుల్ని ఫిబ్రవరి 22న టెర్మినెట్ చేసినట్టు ఆ ప్రతినిధి వివరించారు. క్యూఆర్ కోడ్ ఆగ్రిగేటర్ యాప్ ద్వారా ప్రసిద్దిపొందిన భారత్ పే ప్రమోటర్ల మధ్య కొద్దినెలలుగా లుకలుకలు మొదలయ్యాయి. కంపెనీ ఇన్వెస్టర్లే తనను సెలవుపై పంపించారని, ప్రస్తుత సీఈవో సమీర్ సుహైల్పై తనకు విశ్వాసం లేదని అష్నీర్ గ్రోవర్ విరుచుకుపడుతున్నారు. మరో వ్యవస్థాపకుడైన శాశ్వత్ నక్రాని..సీఈవోకు మద్దతు పలుకుతున్నారు. తనవద్దనున్న 9.5 శాతం వాటాను రూ. 4,000 కోట్లకు ఎవరైనా ఇన్వెస్టరు కొంటేనే తాను కంపెనీ నుంచి వైదొలుగుతానంటూ గ్రోవర్ చెపుతున్నారు.