ముంబై: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేసే ఇండియన్ జట్టులో దినేశ్ కార్తీక్కు చోటు ఇవ్వాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. స్టార్స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు కార్తీక్ మెరుగ్గా రాణించాడు. ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న అతను.. 13 మ్యాచుల్లో 285 రన్స్ చేశాడు. వికెట్కీపర్గా బాధ్యతలు కొనసాగిస్తున్న దినేశ్ తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడని హర్భజన్ అన్నాడు. ఇప్పటి వరకు అతను 8 మ్యాచుల్లో నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో అతని యావరేజ్ 57.00గా ఉంది. అతని స్ట్రయిక్ రేట్ కూడా కళ్లు చెదిరేలా ఉంది. అతని బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ 192.57గా ఉంది. ఇండియన్ జట్టులోకి మళ్లీ అతను తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నట్లు హర్భజన్ తెలిపాడు.
ఆర్సీబీ తరపున దినేశ్ అద్భుతంగా ఆడుతున్నాడని, లెగ్ సైడ్ షాట్లు ఆడడంతో అతను మేటి అని, సింగిల్స్ తీయడంలోనూ దినేశ్ సూపర్ అని, గేమ్ను అతను బాగా అర్థం చేసుకోగలడని భజ్జీ తెలిపాడు. ఈ సీజన్ ఐపీఎల్లో బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషించింది దినేశ్ కార్తీక్ ఒక్కడే అని హర్భజన్ తెలిపాడు. ఒకవేళ తానే సెలెక్టర్ను అయితే, అప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు దినేశ్ కార్తీక్ను ఎంపిక చేసేవాడినన్నాడు. దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యాలు బెస్ట్ ఫినిషర్లు అని భజ్జీ పేర్కొన్నాడు.