ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: డిజిటల్ రుపీని నగదు కోసం కూడా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం తమ పార్టీ వర్చువల్గా నిర్వహించిన ‘ఆత్మనిర్భ అర్థవ్యవస్థ’ను ఉద్దేశించి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ పరిచయం చేసే డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రుపీ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని, ఇవి ఎంతో సురక్షితమని చెప్పారు. రాబోయే ఏండ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ రుపీ దన్నుగా నిలువగలదన్నారు. ఈ క్రమంలోనే ‘ప్రస్తుతం భౌతికంగా మనకు కనిపిస్తున్న రూపాయికే త్వరలో రాబోయే డిజిటల్ రుపీ ప్రతిరూపం. ఈ డిజిటల్ రుపీ లావాదేవీలను కూడా ఆర్బీఐనే నియంత్రిస్తుంది. కాబట్టి డిజిటల్ కరెన్సీని సాధారణ కరెన్సీలోకి కూడా మార్చుకోవచ్చు’ అని స్పష్టం చేశారు. ఫిన్టెక్ రంగంలో డిజిటల్ రుపీ కొత్త అవకాశాలకు తెర తీయగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా మోదీ వ్యక్తం చేశారు.