డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. నిరుడు దేశంలోనే భాగ్యనగరం అగ్రస్థానంలో నిలిచినట్టు ఓ తాజా సర్వేలో తేలింది. రాష్ర్టాలవారీగా చూసినా టాప్-10లో తెలంగాణఉండగా, జిల్లాల్లోనూ ఆన్లైన్ చెల్లింపులదే హవా నడుస్తున్నది.
హైదరాబాద్, మార్చి 24: టెక్నాలజీని తొందరగా అందిపుచ్చుకునే హైదరాబాదీలు.. డిజిటల్ లావాదేవీలను జోరుగా సాగిస్తున్నారు. భౌతికంగా నగదు చెల్లింపుల కంటే ఆన్లైన్లో పేమెంట్లు చేయడానికే అమితాసక్తిని చూపుతున్నారు మరి. ఈ క్రమంలోనే పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) టర్మినల్స్, క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్స్ వంటి ఫిజికల్ టచ్ పాయింట్స్ వద్ద జరిగే లావాదేవీల్లో దేశంలోనే భాగ్యనగరానిది అగ్రస్థానమని తేలింది. తాజాగా విడుదలైన వరల్డ్లైన్ ఇండియా వార్షిక డిజిటల్ పేమెంట్స్ నివేదిక-2021 ప్రకారం దేశంలోని మరే ఇతర ప్రధాన నగరాల్లో లేనివిధంగా నిరుడు హైదరాబాద్లో డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ ఆరో స్థానంలో, వాణిజ్య రాజధాని ముంబై నాల్గో స్థానంలోనే ఉండిపోయినట్టు వివిధ బ్యాంకులకు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలకు టెక్నాలజీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న వరల్డ్లైన్ తెలిపింది.
ఆఫ్లైన్ మార్కెట్లో కిరాణా స్టోర్లకే ఎక్కువమంది కస్టమర్లు తరచూ వెళ్తున్నారని వరల్డ్లైన్ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాత రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు, మెడికల్ షాపులు, హోటల్స్, జ్యుయెల్లరీ షోరూంలు, గృహోపకరణాల వస్తువులు, డిపార్ట్మెంటల్ స్టోర్లకు పోతున్నారని తెలియజేసింది. ఈ క్రమంలోనే మొత్తం లావాదేవీల్లో 60 శాతం వాటా వీటిదేనని, విలువలో 58 శాతం వాటాతో ఉన్నాయని పేర్కొన్నది. ఇక ఆన్లైన్ మార్కెట్లో ఈ-కామర్స్, గేమింగ్, యుటిలిటి, ఆర్థిక సేవలు ముందంజలో ఉన్నాయి. లావాదేవీల్లో వీటి వాటా 87 శాతానికిపైనే. విలువలో 41 శాతంగా ఉన్నది. కాగా, పండుగల సీజన్ కావడంతో నిరుడు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అత్యధిక లావాదేవీలు జరిగాయని, దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షల సడలింపూ కలిసొచ్చిందని వివరించింది.
దేశంలో చలామణిలో ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు నిరుడు 100 కోట్లకుపైనేనని తేలింది. ఈ కార్డుల లావాదేవీల్లో రియల్-టైం పేమెంట్ సిస్టమ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 457 కోట్లపైనే. 2020తో పోల్చితే 105 శాతం పెరిగాయి. విలువపరంగా 111 శాతం వృద్ధితో రూ.8.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మొబైల్ యాప్ ఆధారిత లావాదేవీలు రికార్డుస్థాయిలో 106 శాతం పెరిగాయి. క్రెడిట్ కార్డుల సగటు లావాదేవీ విలువ రూ.4,122గా ఉండగా, 2020తో చూస్తే 12 శాతం పెరిగింది. అయితే డెబిట్ కార్డుల సగటు లావాదేవీ విలువ 29 శాతం క్షీణించి రూ.1,804కు పరిమితమైంది. ఇది గూగుల్పే, ఫోన్పే తదితర యూపీఐ లావాదేవీల పెంపును సూచిస్తున్నది.
1 హైదరాబాద్,
2 బెంగళూరు
3 చెన్నై
4 ముంబై
5 పుణె
6 న్యూఢిల్లీ
7 కోల్కతా
8 కోయంబత్తూర్
9 అహ్మదాబాద్
10 వడోదర