హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడిన ఆ ప్రాథమిక పాఠశాలలో నేడు 925 మంది చదువుకుంటున్నారు. ఏ సర్కారు బడిలో లేని విధంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులను కొనసాగిస్తున్నారు. అదే పడిలేచిన కెరటంలా వినూత్న విద్యాబోధనతో దూసుకెళ్తున్న మేకలమండి (బన్సీలాల్పేట) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ప్రస్తుతం మూడు అంతస్తుల భవనంలో డిజిటల్ స్కూల్గా మారి ఆన్లైన్ క్లాసులు సైతం నిర్వహిస్తున్నది. ఈ పాఠశాలను 1963లో సికింద్రాబాద్ మండలం భోలక్పూర్ పరిధిలోని కృష్ణానగర్కాలనీలో ఏర్పాటుచేశారు. 1996 వరకు అక్కడే స్కూల్ నడిచింది. అనంతరం ఈ పాఠశాలను ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలగా మార్చి న్యూ బోయిగూడకు తరలించారు. 1996 నుంచి 2008 వరకు పాఠశాల అక్కడ కొనసాగింది. 2008లో స్కూళ్ల విలీనంలో భాగం గా జిల్లాలో 282 స్కూళ్లను మూసివేశారు. ఈ బడిని సైతం మూసివేసి, న్యూ బోయిగూడ స్కూల్లో విలీనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రొటెక్షన్ కమిటీ ఆమరణ దీక్షకు దిగడంతో అప్పటి కలెక్టర్ మూసివేసిన స్కూళ్లను మరో ప్రాంతంలో తెరుస్తామని (రీ లోకేషన్) ప్రకటించారు. రీ లోకేషన్ ప్రణాళికలో భాగంగా కృష్ణానగర్కాలనీలోని మేకలమండిలో 2011లో సున్నా విద్యార్థులతో ఇంగ్ల్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారు. నాడు విద్యార్థుల్లేక వెలవెలబోయిన పాఠశాల.. నేడు 925 మందితో కళకళలాడుతున్నది. ఎర్లీ చైల్డ్ కౌంట్ (ఈసీఈ)లో ఈ స్కూల్ 120 మంది విద్యార్థులతో ప్రాథమిక పాఠశాలల క్యాటగిరీలో జిల్లాలోనే మొదటిస్థానం లో నిలిచింది. 2013లో ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు 280 విద్యార్థులు చేరారు. 2013లో ఈసీఈ ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రభుత్వం రద్దుచేసినా.. దాతల సహకారంతో విద్యావలంటీర్లకు వేతనాలు చెల్లిస్తూ ఎల్కేజీ, యూకేజీ కోర్సులను కొనసాగిస్తున్నారు. వి ద్యార్థుల సంఖ్య పెరగడంతో 2019లో ఈ బడిని ప్రా థమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. ఇటీవల ఎ మ్మెల్సీ సురభి వాణీదేవి నిధుల నుంచి రూ. 25 లక్షలు తరగతి గదులకు కేటాయించారు. ప్రస్తుతం అన్ని వసతులతో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి.
దాతల ఔదార్యం..
ఈ పాఠశాల అభివృద్ధిలో దాతల ఔదార్యం ఎనలేనిది. 2011లో జేసీఐ సంస్థ 50 బెంచీలు, 10 కంప్యూటర్ టేబుళ్లు ఇచ్చింది. రెండు తరగతి గదులకు ఎడ్యుకేషనల్ పెయిటింగ్స్ వేయించింది. ఎన్టీపీసీ విద్యార్థులకు యూనిఫాంలు, నోటుపుస్తకాలను అందజేసింది. మంచుకొండ ఫౌండేషన్ చైర్మన్ మంచుకొండ ప్రకాశం ఇప్పటివరకు రూ.10 లక్షలు వెచ్చించి పాఠశాలను డిజిటల్ స్కూల్గా మార్చేశారు. పలు వసతులు కల్పించారు. రోటరీక్లబ్, లయన్స్క్లబ్లు సైతం ఇతోధికంగా సహాయమందించాయి.
అందరి సహకారంతోనే
మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. డిజిటల్ స్కూల్గా మార్చి, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. 900 పైచిలుకు విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల కొనసాగడంతో అందరి సహకారం మరువలేనిది. తల్లిదండ్రులు, పిల్లల, టీచర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల మద్ధతు వల్లే ఈ స్థాయిలో బడిని నిలుపగలిగాం.
– మల్లికార్జున్రెడ్డి, హెచ్ఎం