హాజీపూర్, పిభ్రవరి 25 : మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం పూర్తవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వీరు బాధ్యతలు స్వీకరించి 25 రోజులు గడుస్తున్నా చెక్పవర్ కల్పించకపోవడంతో వివిధ రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది వరకు సర్పంచ్, ఉప సర్పంచ్లకు కలిపి చెక్ పవర్ ఉండేది. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. గెజిటెడ్ స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. పంచాయతీల్లో జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేకాధికారులకు చెక్ పవర్ ఇవ్వాల్సి ఉంది.
ప్రత్యేకాధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంఘం నిధుల వినియోగం కోసం ప్రత్యేకాధికారులకు డిజిటల్ కీ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ నిధుల వినియోగం కోసం బ్యాంక్ చెక్లపై సంతకాలు మార్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో చెక్ పవర్ పెండింగ్లో ఉంది. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపు, పంచాయతీల నిర్వహణ, ఇతర బిల్లుల చెల్లింపుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడుతుందని స్థానికులు అటు ప్రభుత్వంపై.. ఇటు అధికారులపై మండిపడుతున్నారు. ఇకనైనా ప్రత్యేకాధికారులకు చెక్ పవర్ కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.