గర్భధారణ సమయంలో పిండం వేగంగా ఎదుగుతూ ఉండటం వల్ల తల్లి పోషకాహార అవసరాలు పెరుగుతాయి. పన్నెండో వారంలో 15 గ్రాముల బరువు ఉన్న పిండం నలభయ్యో వారానికి దాదాపు 3,200 గ్రాములకు చేరుకుంటుంది. ఆ క్రమంలో తనకు అవసరమైన బలాన్ని తల్లి నుంచే సమకూర్చుకొంటుంది. కాబట్టి తల్లికి పౌష్టికాహారం ఇవ్వకపోతే, ఇద్దరిలో ఆహార లోపాలు ఏర్పడుతాయి. ఇది గర్భస్రావానికి, ముందస్తు ప్రసవానికి దారితీయవచ్చు. కొన్నిసార్లు గర్భస్థ శిశువు మరణానికి కూడా కారణం కావచ్చు. ఆహార లోపాలు తీవ్రంగా ఉన్నప్పుడు, బిడ్డ 2,500 గ్రాములకంటే తక్కువ బరువుతో జన్మించవచ్చు. బరువు తక్కువ బిడ్డలకు అంటువ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ. అన్ని విధాలా ఆరోగ్యవంతులైన స్త్రీలు గర్భంవల్ల దాదాపు 11-12 కిలోల బరువు పెరుగుతారు. గర్భం చివరి దశలో అధిక శారీరక శ్రమ మంచిది కాదు. విశ్రాంతి లేనట్లయితే ఆహార లోపాలు మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. వరుస కాన్పులు కూడా తల్లికి ప్రాణాంతకమే. ఆహార లోపాలున్న స్త్రీల విషయంలో ప్రసవం తర్వాత, పాల తయారీకి కావలసిన పదార్థాలను సమకూర్చుకోవడంలో శరీరం విఫలం అవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి, నాణ్యత తగ్గుతుంది. గర్భిణికి చివరి 4 నెలల్లో పోషక అవసరాలు మరీ ఎక్కువ. శిశువు శరీరంలోని మాంసకృత్తుల్లో మూడింట రెండువంతులు చివరి 2-3 నెలల్లోనే సమకూరుతాయి. ఇదే దశలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా శరీరంలో చేరుతాయి. అందువల్లే నెలలు నిండని శిశువులలో ఇనుము, క్యాల్షియం తదితర లోపాలు ఎక్కువ. నాలుగు, అయిదు, ఆరు నెలల్లో కొవ్వు పదార్థం తల్లి శరీరంలో నిలువ ఉండిపోయి.. భవిష్యత్తులో పాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
అనేక కారణాలు
ఆహార లోపాలకు పేదరికంతో పాటు అపోహలూ ఓ కారణమే. చాలా కుటుంబాల్లో మగవాళ్లు తినగా మిగిలిన అడుగుబొడుగు అన్నమే గృహిణులకు దిక్కు అవుతున్నది. గర్భధారణ సమయంలో, ప్రసవం తరువాత ‘ఇది తినవద్దు, అది తినవద్దు’ అంటూ కట్టడి చేయడమూ పోషక విలువల లోపానికి కారణమే. బలమైన ఆహారం తీసుకుంటే, కడుపులోని శిశువు బొద్దుగా తయారై ప్రసవం కష్టం అవుతుందని నమ్మేవాళ్లూ ఉన్నారు. నిజానికి, గర్భధారణ దశలోనూ, ప్రసవం తర్వాతా.. మిగతా సమయంతో పోలిస్తే దాదాపు 25 శాతం ఆహారం ఎక్కువ ఇవ్వాలి. ఆ బాధ్యత పుట్టింటివారో, అత్తింటివారో స్వీకరించాలి.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు