12 సీజన్లు.. 9 ఫైనల్స్.. 4 ట్రోఫీలు, ఐదుసార్లు రన్నరప్.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే గణాంకాలివి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన చెన్నైకి ఇవన్నీ అందించింది ఒకే ఒక్కడు. అతడే మహేంద్రుడు. సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే సూపర్ కింగ్స్.. అన్న రేంజ్లో జట్టుపై తనదైన ముద్ర వేసిన మాస్టర్మైండ్ ధోనీ.. కెప్టెన్సీకి వీడ్కోలు పలికి జడ్డూకు బాధ్యతలు అప్పగించాడు.
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతూ వస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ.. గురువారం కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. తాజా వేలానికి ముందే తన విలువ తగ్గించుకొని రవీంద్ర జడేజాను తొలి ప్రాధాన్య ఆటగాడిగా ఎంపిక చేసుకునేలా చేసిన మహీ.. 15వ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు అభిమానులకు షాకిచ్చాడు. ‘ధోనీ జట్టు పగ్గాలను జడేజాకు ఇవ్వాలని నిర్ణయించాడు. 2012 నుంచి చెన్నైతో కొనసాగుతున్న జడ్డూ.. జట్టులో ఎప్పుడూ కీలక ఆటగాడే. ఈ సీజనే కాదు.. మున్ముందు కూడా ధోనీ చెన్నైతోనే కొనసాగుతాడు’అని ఫ్రాంచైజీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.