అడిలైడ్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో ధోనీ అత్యంత చురుకైన క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. వివిధ దేశాల్లో వేర్వేరు జట్లతో కలిసి ఆడటం ద్వారా ధోనీ అనుభవాన్ని గడించాడని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఏ పిచ్పై ఎలా ఆడాలో ముందే పసిగట్టి ప్రణాళికలు రూపొందించడంలో కెరీర్ తొలినాళ్ల నుంచే మహీ ఆరితేరాడని చాపెల్ చెప్పుకొచ్చాడు. బుధవారం ఒక ప్రైవేట్ వెబ్సైట్కు రాసిన కాలమ్లో చాపెల్ పలు అంశాలను ప్రస్తావించాడు. ‘భారత ఉపఖండంలో ఇప్పటికీ చాలా పట్టణాల్లో క్రికెట్ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందలేదు. చాలామంది కుర్రాళ్లు నిపుణుల సహాయం లేకుండా రోడ్లపై, ఖాళీ మైదానాల్లో క్రికెట్ ఆడటం చూస్తుంటాం. అందువల్లే టీమ్ఇండియాలో ఒక్కో ప్లేయర్ విభిన్న శైలి కల్గి ఉంటారు. పసితనం నుంచే ఆటలో మెళకువలు నేర్చుకుంటారు. ఇందుకు ధోనీనే సరైన ఉదాహరణ. అవును.. భారత కోచ్గా పనిచేసినప్పుడు అతడిని చాలా దగ్గరి నుంచి పరిశీలించా. కెరీర్ మొదట్లో అనుభవజ్ఞలైన క్రికెటర్లతో వేర్వేరు ప్రాంతాల్లో ఆడటం ద్వారా పట్టు సాధించాడు. పరిస్థితులకు అనుగుణంగా వ్యుహాలు రచించడంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చురుకుగా వ్యవహరించేవాడు’ అని అన్నాడు.