హైదరాబాద్, నవంబర్ 11, (నమస్తే తెలంగాణ)ః భూ యాజమాన్య హక్కుల ధరణి పోర్టల్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇది ప్రారంభమైన ఏడాది కాలంలోనే అనూహ్య విజయాలను సొంతం చేసుకొన్నది. ఏకంగా 10 లక్షల లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర ఖజానాకు నేటి వరకు (నవంబర్ 11) రూ.1,440 కోట్ల ఆదాయం తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ను మరింతగా మెరుగుపరచడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఆ దిశగా పోర్టల్లో ప్రవేశ పెట్టాల్సిన ఐచ్ఛికాలతోపాటు సేలను విస్తృత పరచే దిశగా దృష్టిసారించింది. మంత్రి టీ హరీశ్రావు చైర్మన్గా ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయి చర్చించింది. ఉపసంఘం దృష్టికి ఉద్యోగులు, నిపుణుల నుంచి సూచనలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
ధరణి సూపర్ సక్సెస్తో.. ఇంతకాలంగా ధరణిపై విపక్ష నేతలు చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం పసలేదని ఈ మైలురాళ్లే స్పష్టంచేస్తున్నాయి. వ్యవసాయ భూ సంబంధిత లావాదేవీలు, క్రయ, విక్రయాలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్ల అనంతర పట్టాదారులకు పాసు పుస్తకాల జారీ వంటి సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయేతర స్థిరాస్తి క్రయ, విక్రయాలతోపాటు ఇతర రిజిస్ట్రేషన్ల సేవలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించి వ్యవసాయ భూ సంబంధ క్రయ, విక్రయాలు, మ్యుటేషన్లు, లావాదేవీల కోసం ప్రత్యేకంగా ధరణి పోర్టల్ను రూపొందించారు.
గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వ్యవసాయేతర క్రయ విక్రయాలు జరిగేవి. రైతులు, భూ సంబంధ సమస్యల కోసం ఈ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఈ కాష్టాల నుంచి రైతులకు విముక్తి కలిగించి.. రైతుల ముంగిట్లోనే క్రయవిక్రయాలు జరిగేలా 574 తాసిల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల కొన్ని రోజులు లావాదేవీలు ఆగిపోయినప్పటికీ.. దీని ద్వారా నెలకు సగటున 83 వేల లావాదేవీలు, రూ.120 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 12 నెలల వ్యవధిలో రూ.1,440 కోట్ల ఆదాయం రాగా.. 10 లక్షల లావాదేవీలు జరిగాయి. పోర్టల్ ప్రారంభమైన తొలినాళ్లలో స్వల్ప సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని వెంటనే పరిష్కరించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ధరణి పోర్టల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివి.. అసంబద్ధమైనవని ఆయన కొట్టిపారేశారు.
ఏప్రిల్ రూ. 81 కోట్లు
మే రూ. 23 కోట్లు
జూన్ రూ.91 కోట్లు
జూలై రూ.156 కోట్లు
ఆగస్టు రూ.147 కోట్లు
సెప్టెంబర్ రూ. 154 కోట్లు
అక్టోబర్ రూ. 131 కోట్లు
1) నంబర్ ఆఫ్ హిట్స్ 5,17,80,691
2) స్లాట్ బుకింగ్స్ 10,45,878
3) సేల్స్ 5,02,281
4) గిఫ్ట్ డీడ్స్ 1,58,215
5) వారసులకు హక్కులు 72.085
(యాజమాని మరణానంతరం)
6) మార్ట్గేజ్ (తనఖా) 58,285
7) నాలా 29,453
(భూ బదలాయింపు)
8) సంస్థలకు లీజు 26,372
9) పార్టిషన్ (పంపకాలు) 4,360
10) జీపీఏ 420 (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)
11) డీఏజీపీఏ 778 (డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)
12) సేల్ కమ్ జీపీఏ 381
13) లీజు (కౌలు) 244