న్యూఢిల్లీ: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ చర్యలు తీసుకున్నది. రూల్స్ అతిక్రమించిన ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. స్పైస్జెట్కు చెందిన ఓ కమాండ్ పైలెట్పై ఆరు నెలల నిషేధం విధించారు. మేఘాల్లోకి వెళ్లవద్దు అని కో పైలెట్ వార్నింగ్ ఇచ్చినా కమాండ్ పైలెట్ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. మే ఒకటో తేదీన ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న విమానం తీవ్ర కుదుపుకు గురైంది. కమాండ్ పైలెట్ సరైన రీతిలో ఆ విమానాన్ని నడపలేకపోయారు. ఆ సమయంలో విమానంలో సుమారు 195 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఇక మరో కేసులో ఓ చార్టర్ విమానానికి చెందిన పైలెట్ లైసెన్సును సస్పెండ్ చేశారు. నెల రోజుల పాటు లైసెన్సును నిలిపివేశారు. 2021 అక్టోబర్ 19న బొకారో నుంచి రాంచీ వెళ్తున్న విమానంలో ఇంధనం లేదని ఆ విమానాన్ని అత్యవసరంగా దించారు. కానీ ఆ విమానంలో కావాల్సినంత ఇంధనం ఉందని విచారణలో తేలింది.