కీసర, జనవరి 1: తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో ఉన్న స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు కాశీవిశ్వేరాలయం , శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి , శ్రీ నాగదేవత ఆలయం, రాజగోపురం ముందున్న శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్రెడ్డి, వేదపండితులు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో…
కీసర మండల పరిధిలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ఉన్న స్వామికి నిర్వహించిన స్వర్ణపుష్పాభిషేకంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్ పాల్గొన్నారు.