బాసర : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు గురువారం నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు . ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. ఆలయ గోపురాలకు ప్రత్యేక పూలతో అలంకరించారు. రాత్రివేళలో ఆలయం విద్యుత్ కాంతుల నడుమ మెరిసి పోతుంది. ఆలయంతో పాటు వ్యాసమహర్షి ఆలయాన్ని సైతం అందంగా ముస్తాబు చేశారు.
ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు తాగునీరు, ప్రసాద వితరణ, వైద్య, పోలీసు, ఆలయ అధికారులు సేవలందిస్తారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన జగదీశ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చి భక్తులకు ఉచితంగా అన్నదానం చేయనున్నారు. ఆలయంలో భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. కొవిడ్ దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులను ధరించాలని ఆలయ ఈవో వినోద్ రెడ్డి అన్నారు.