కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం పోరుగడ్డ జోడెఘాట్ స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల పట్టింపులేని తనంతో ఆనవాళ్లు కోల్పోగా, తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధి చెందుతున్నది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి సీఎం కేసీఆర్ జోడెఘాట్ను సందర్శించారు. ఆ సమయం లో ఇచ్చిన హామీ మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, జోడెఘాట్తోపాటు పరిసర గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.15.70 కోట్లు మంజూరు చేయగా.. జోడెఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించారు. దీంతో ఆ ప్రాంత ప్రజల దారి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. రూ.25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 12 గ్రామాల పరిధిలోని పిల్లల కోసం రూ.2.95 కోట్లతో ఆశ్రమ పాఠశాల నిర్మిస్తుండగా దాదాపు పూర్తికావచ్చింది. జోడెఘాట్తోపాటు పరిసర గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. 11 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నారు. జోడెఘాట్ గ్రామానికి త్రీఫేస్ విద్యుత్తు సౌకర్యం కల్పించారు. దాదాపు 30 మంది గిరిజన రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐటీడీఏ ద్వారా అందించారు. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. జోడెఘాట్లో ప్రత్యేకంగా 30 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా, నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ అనే కుమ్రంభీం నినాదానికి జీవం పోసిన తెలంగాణ ప్రభుత్వం.. 500 జనాభా కలిగిన గిరిజన తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పోరాట వీరుడు కుమ్రంభీం 81వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం అధికారికంగా కార్యక్రమాల నిర్వహణకు జోడెఘాట్ సిద్ధమైంది.