హైదరాబాద్ : యాదాద్రి జిల్లా రామగిరి ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు టీచర్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రమాదేవి, రేణుకారాణి అనే టీచర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు పలువురు తినుబండారాలు కొనుక్కునేందుకు కిరాణ దుకాణానికి వెళ్లారు. సదరు దుకాణం యజమాని లింగప్ప వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆ తర్వాత విద్యార్థినులు పాఠశాలకు వచ్చి విషయాన్ని టీచర్లకు వివరించారు. టీచర్లు ఉన్నతాధికారులకు తెలుపకుండా.. విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇదే విషయంపై బాధితుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. లింగప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే, వేధింపుల విషయంపై విద్యాశాఖ అంతర్గత విచారణ జరిపింది. విద్యార్థినుల పట్ల దుకాణం యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని టీచర్లకు చెప్పినా.. పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. ఈ మేరకు రమాదేవి, రేణుకాదేవిని సస్పెండ్ చేస్తూ ఈడీవో నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.