సికింద్రాబాద్, జనవరి 6: కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన భూములను కబ్జాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని కంటోన్మెంట్ బోర్డు ఇంజినీర్ బాలకృష్ణ హెచ్చరించారు. బోర్డు పరిధిలోని ఆరో వార్డు భారతి కాలనీలోని బోర్డుకు సంబంధించిన 133 గజాల స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ స్థలం కాలనీకి చెందిన పార్కు స్థలమని, ప్రస్తుతం కబ్జాకు గురవుతుందంటూ స్థానికులు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఈఓ అజిత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం అక్కడికి చేరుకున్న బోర్డు అధికారులు ఉమాశంకర్, బాలకృష్ణ, గోపాలకృష్ణదాస్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుని అందులో వేసిన షెడ్లను తొలగించి ఆ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అనుమతులు లేకుండా షెడ్లను వేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలలో బోర్డు సిబ్బందితో పాటు బోయిన్పల్లి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.