శామీర్పేట, జనవరి 19 : అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం తూంకుంటలో పర్యటించారు. హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తుతో కూల్చీవేతలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి యశ్వంత్రావు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మున్సిపల్ పరిధిలోని తూంకుంట రాజీవ్ రహదారిపై రెండు షల్టర్ నిర్మాణాలు, అంతాయిపల్లిలో 1, దేవరయాంజాల్లో రెండు గోదాంలను కూల్చివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు ధీరజ్, స్వరూప, జేపీవో సత్యనారాయణ, సుధీర్, తూంకుంట మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్, టీపీవో మేఘన, సిబ్బంది, 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.