టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత ప్రస్తుత ఏపీ నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. ‘సార్ టీఆర్ఎస్ పార్టీని మా ప్రాంతంలోనూ స్థాపించండి. మీ పార్టీని గెలిపించుకొంటామని ఆంధ్రాప్రాంతం వారు నన్ను కోరుతున్నారు’ అని తెలిపారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ దేశంలోనే మొదటి, రెండో స్థానంలో ఉందన్నారు. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్న ఏపీ ప్రాంత వ్యక్తి.. తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది.. కరెంటు రాదు అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు.. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది. కర్ణాటక రాయచూర్ ఎమ్మెల్యే.. తెలంగాణలో అమలుచేసే పథకాలు మాకూ కూడా అమలుచేయండి లేదంటే మా నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపండి అని అని బహిరంగంగా డిమాండ్ చేశారు’అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.