ఎప్పుడు..?ఆదివాసుల అభివృద్ధిలో విద్య పాత్ర కీలకం. తెలంగాణలోని గిరిజనుల విద్యాభివృద్ధికి, చరిత్ర, సంస్కృతి పురోభివృద్ధికి విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరగవలసిన అవసరం ఉన్నది. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’ లో పేర్కొన్న విధంగా తెలంగాణలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇంకా కాగితాలకే పరిమితమైంది. దీనికి కేంద్ర నిర్లక్ష్యమే కారణం.
రాష్ట్రంలో గిరిజనుల జనాభా 33 లక్షలు. రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి కొట్లాడి అమరులైన గిరిజన బిడ్డలు భోజ్యానాయక్, ప్రవీణ్ నాయక్ మొదలగు వారి ప్రాణత్యాగాల సాక్షిగా గిరిజనులకు న్యాయబద్ధంగా దక్కవలసిన జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. అలాగే గిరిజన వర్సిటీ ఏర్పాటుకావలసి ఉన్నది. పునర్వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూల్లో రెండు రాష్ర్టాలకు రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నది.
చట్టంలో పేర్కొనబడినవిధంగా గిరిజన యూనివర్సిటీ ఏపీలోని విజయనగరంలో 2019లో ప్రారంభించబడింది. కానీ తెలంగాణ గిరిజన యూనివర్సిటీకి ఇంకా మోక్షం రాకపోవడం శోచనీయం. తెలంగాణలో కూడా గిరిజన యూనివర్సిటీ ఏర్పడితే గిరిజనులకు అనేకరకాలుగా లాభం చేకూరుతుంది. ఆదివాసీ జీవనవిధానం వారి భాష, సంస్కృతి, కళలు, సాహిత్యం తెలుసుకోవడానికి, వాటిని పరిరక్షించుకోవడానికి వీలవుతుంది. తెలంగాణలో తొమ్మిది తెగలుగా ఉన్న గిరిజనులపై విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరిగితే వారి చరిత్ర రక్షించబడుతుంది.
గిరిజన వర్సిటీ ఏర్పాటులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ‘రెడ్డి సుబ్రహ్మణ్యం కమిటీ’ ములుగు జిల్లా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించింది. ములుగు జిల్లా జాకారంలో 335.04 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. రూ.4 కోట్లు 2019-20 బడ్జెట్లో ఎంహెచ్ఆర్డీ నిధులు కూడా కేటాయించింది. మరో 350 ఎకరాలు భూమిని కేటాయించాల్సి ఉన్నది. యూనివర్సిటీల నిర్మాణానికి కేంద్రం మరో వెయ్యి కోట్ల నిధులు కేటాయించి పూర్తిస్థాయి ఉపకులపతిని నియమిస్తే ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుంది.
దేశంలో నడుస్తున్న వివిధ కేంద్ర విశ్వవిద్యాలయా లు, ఏకలవ్య పాఠశాలల్లో అవి ఏర్పడిన ప్రాతిపదికన వాటిలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాగే తెలంగాణలో ప్రారంభించే వర్సిటీలో అత్యధిక శాతం గిరిజనులకు అవకాశాలు కల్పిస్తూ కచ్చితమైన ప్రణాళికతో అమలు చేయాలి. వర్సిటీలో గిరిజనులకు అర్థమయ్యేటట్లుగా కొన్ని కోర్సులను వారి భాషలో ఏర్పాటుచేయా లి. గిరిజనుల్లో ప్రతి తెగకు వారి భాష అభివృద్ధి శాఖను ఏర్పాటుచేయాలి.
గిరిజనులకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి అధ్యాయం పరిశోధన కేంద్రాలుండాలి. ములుగులో యూనివర్సిటీ ఏర్పాటుచేసి ఆదిలాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, హైదరాబాద్లలో రీజినల్ సెంటర్లను ఏర్పాటుచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని కేంద్రానికి పలుమార్లు విన్నవించినా ఎటువంటి స్పందన లేదు. కేంద్రం ఇకనైనా స్పందించి గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటుచేయాలి.