న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాఠశాలలు మూసివేయడంతో పాటు నిర్మాణాలు, కూల్చివేతలు, డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధించాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజా జరిగిన అధ్యయనంలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బయటే కాకుండా ఇంటి లోపల కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు తేలింది.
20 రెట్లు ఎక్కువగా కాలుష్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకటించిన ప్రమాణాల కంటే ఢిల్లీలో ఇండ్లలో వాయుకాలుష్యం 20 రెట్లు ఎక్కువగా ఉందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. పీఎం స్థాయి (వ్యాసంలో 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ కణాలు) ప్రభుత్వ మానిటరింగ్ సంస్థలు చెప్పిన వాటికంటే గణనీయంగా ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. తక్కువ ఆదాయ గృహాల కంటే అధిక ఆదాయ గృహాలు 13 రెట్లు ఎక్కువ గాలి శుద్ధి చేసే అవకాశం ఉందని, అయితే ఇండోర్ వాయు కాలుష్యంపై దాని ప్రభావం కేవలం 10 శాతం మాత్రమేనని తేలింది. ఎయిర్ ప్యూరీఫైయర్లు ఉన్న గృహాల్లో సాధారణంగా ఇండోర్ PM2.5 స్థాయిలో 8.6 శాతం తగ్గాయని అధ్యయనం పేర్కొంది.
అవగాహనతోనే స్వచ్ఛమైన గాలి
దేశ రాజధానిలో పేద, ధనిక తేడా లేకుండా ఎవరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేరని అధ్యయనం ప్రధాన రచయిత కెన్నెత్ లీ అన్నారు. ఇది సంక్లిష్టమైన విష వలయమని పేర్కొన్నారు. ఇండ్లలో ఉన్న కాలుష్యంపై చింతించొద్దని, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశం తక్కువగా ఉందన్నారు. కేవలం అవగాహన పెరగడం వల్లనే స్వచ్ఛమైన గాలి లభించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో 2018 – 2020 మధ్యకాలంలో వేలాది కుటుంబాలను అధ్యయనం సర్వే చేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో గృహాల్లో ఎక్కువగా వంట చేసే సమయంలో ఇండోర్ PM2.5 స్థాయి పెరిగినట్లు గుర్తించారు.