న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 12 సంవత్సరాల తర్వాత ఒకే రోజు అత్యధిక వర్షాపాతం నమోదైంది. నగరంలో 24 గంటల్లో 112.1 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయాయి. వరదలు నగరంలో ట్రాఫిక్పై తీవ్ర ప్రభావం చూపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో సగటున 125.1 మిల్లీ మీటర్ల వాన కురుస్తుందని అంచనా. ఇందులో 95శాతం వర్షాపాతం బుధవారం ఒకే రోజు రికార్డయ్యింది. వాతావరణ మార్పుల కారణంగా రుతువనాల నమూనా మారుతోందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ పేర్కొన్నారు. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో వర్షం కురిసే రోజులు తగ్గిందని, తీవ్రమైన వాతావరణ సంఘటనలు పెరిగాయన్నారు.
ప్రస్తుతం తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు నమోదవుతున్నాయని, కొన్నిసార్లు 24 గంటల్లోనే వంద మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డవుతుందన్నారు. గతంలో 10 నుంచి 15 రోజుల్లో ఈ వాన కురిసేదని చెప్పారు. ఐఎండీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ బుధవారం ఉదయం 8.30 వరకు 24 గంటల్లో 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 12 సంవత్సరాల్లో ఇదే అత్యధికమని పేర్కొంది. లోధి రోడ్ లో 120.2 మి.మీ, రిడ్జ్లో 81.6 మి.మీ, పాలెం71.1 మి.మీ, అయానగర్లో 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలకు ఢిల్లీలోని పలు వీధుల్లో వరద ముంచెత్తింది. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. పలు చోట్ల వరద నీరు చేరడంతో అండర్ పాస్లు మూసివేశారు.