హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : భారత సైన్యంలో పెరుగుతున్న మహిళాశక్తి ఐఏఎఫ్ను బలోపేతం చేస్తున్నదని, ఇది మన సాయుధ దళాల సమష్టి, సమతుల్య అభివృద్ధికి నిదర్శనమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం దుండిగల్లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్(సీజీపీ)కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారత వైమానిక దళంలోకి అడుగుపెట్టిన మహిళా అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. వైమానిక దళంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాక్షించారు. ఇది సాయుధ దళాల సమగ్రతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. క్యాడెట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశానికి రక్షణ కవచంలా, శత్రువులపై కత్తిలా ఐఏఎఫ్ పనిచేస్తున్నదని కొనియాడారు.
1947 కశ్మీర్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 2025లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఐఏఎఫ్ చూపిన శౌర్యాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో తుడిచిపెట్టడంలో మన యుద్ధ విమానాలు, పైలట్లు చూపిన ప్రతిభ అసాధారణమని కొనియాడారు. ప్రస్తుత యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయిందని, శత్రువు, ఆయుధం ప్రత్యక్షంగా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయని పేరొన్నారు. రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్, ఏఐ వంటి సాంకేతిక వ్యవస్థలు యుద్ధగతిని మార్చేశాయని తెలిపారు.
సీసీటీవీ నెట్వర్లు, ట్రాఫిక్ వ్యవస్థలను సైబర్ దాడుల ద్వారా నియంత్రించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు భారత వైమానిక దళంలో అధికారులుగా ‘రాష్ట్రపతి కమిషన్’ పొందారు. వీరిలో తొలిసారిగా జాతీయ డిఫె న్స్ అకాడమీ ద్వారా ఎంపికైన మహిళా క్యాడె ట్ల తొలి బ్యాచ్ కూడా ఉండటం విశేషం.
పరేడ్ను సమీక్షించి, పట్టభద్రులైన క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ ‘రాష్ట్రపతి కమిషన్’ను ప్రదానం చేశారు. భారత నౌకాదళానికి చెంది న 9 మంది, భారత తీర రక్షక దళానికి చెందిన ముగ్గురు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులకు ‘వింగ్స్’ ప్రదానం చేశారు. నావిగేషన్ శిక్షణ పూర్తిచేసుకున్న ముగ్గురు అధికారులకు ‘బ్రెవెట్స్’ అందజేశారు. పరేడ్ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వంలో ఫ్లైపాస్ట్ నిర్వహించారు. పిలాటస్ పీసీ-7, ఎంకే-II, హాక్, కిరణ్, చేతక్ విమానాలు ఇందులో పాల్గొన్నాయి.
‘ఆకాశ్ గంగా’ సైడైవింగ్ బృందం, ‘శక్తి’ మహిళా ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమాన విన్యాసాలు, సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శన, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్ కోర్సులో మొదటి స్థానం సాధించిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆశిష్కుమార్యాదవ్కు ‘ప్రెసిడెంట్ ప్లాక్’తోపాటు ‘నవానగర్ స్వోర్డ్ ఆఫ్ హానర్’ ప్ర దానం చేశారు. నావిగేషన్ విభాగంలో ఫ్ల యింగ్ ఆఫీసర్ ఏక్తాగుప్తా, గ్రౌండ్ డ్యూటీ వి భాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ దివ్యాంశిసింగ్ ‘ప్రెసిడెంట్ ప్లాక్’లు అందుకున్నారు.