హైదరాబాద్, మే 2: మరో రెండు రోజుల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో సోమవారం బంగారం ధర భారీగా పతనమయ్యింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి తులం ధర ఏకంగా రూ.1,280 మేర పడిపోయి రూ. 51,150 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల ధర రూ. 1,190 మేర క్షీణించి రూ. 47,200 వద్దకు దిగింది. ద్రవ్య విధాన సమీక్షపై ఫెడ్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) పెంచవచ్చని 99 శాతం మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారం పెద్ద కుదుపునకు లోనయ్యింది. ఔన్సు ధర భారీగా 55 డాలర్లు పడిపోయి 1,855 డాలర్ల స్థాయిని తాకింది. ఈ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 1,150 మేర పడిపోయి, రూ.50,600 వద్దకు చేరింది.
బంగారం బాటలోనే మరో విలువైన లోహం వెండి ధర సైతం పెద్ద పతనాన్ని చవిచూసింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర భారీగా రూ.1,900 తగ్గి, రూ.67,600 వద్దకు దిగివచ్చింది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 3.5 శాతం పడిపోయి 22.30 డాలర్ల వద్దకు చేరింది. ఫెడ్ రేట్ల పెంపు వార్తలతో డాలర్ బలపడుతున్నదని, అమెరికాలో బాండ్ ఈల్డ్స్ ర్యాలీ జరుపుతున్నాయని, ఈ అంశాలతో బంగారం, వెండి తదితర కమోడిటీల ధరలు తగ్గుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు. ఇతర కమోడిటీలు క్రూడ్తో పాటు రాగి, అల్యూమినియం, జింక్ తదితర లోహాల ధరలు ప్రపంచ మార్కెట్లో బాగా తగ్గాయి.