హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక క్యాలెండర్’ (జాబ్ క్యాలెండర్)ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని సూచించింది. మరో వైపు ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కోసం బుధవారం సైతం కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం తిరిగి రెండు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది.
కొత్త జోనల్ వ్యవస్థకు మేరకు ఉద్యోగుల వారీ కేటాయింపులు
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీగా కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని.. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్కు చేసిన విజ్ఞప్తి మేరకు కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు.. భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులకు సూచించింది.