న్యూఢిల్లీ : జైడస్ క్యాడిలా కొవిడ్ టీకా జైకోవ్-డీ ధరపై చర్చ జరుగుతోందని.. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మంగళవారం తెలిపారు. టీకాను జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) ఆగస్ట్ 20న జైడస్ క్యాడిలా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదించిన విషయం తెలిసిందే. టీకా అక్టోబర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా.. జైకోవ్-డీ ప్రపంచంలోనే మొదటి ప్లాస్మిడ్ డీఎన్ఏ టీకా.
మూడు డోసులు కాగా.. మొదటి మోతాదు ఇచ్చిన 28 రోజులకు రెండో, 56 రోజున మూడో మోతాదు ఇవ్వనున్నారు. ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారికే టీకా అందుబాటులో ఉండగా.. ఈ టీకా 12 సంవత్సరాలుపై బడిన పిల్లలకూ ఇవ్వనున్నారు. హైదరాబాద్కు చెందిన ఫార్మా స్యూటికల్ కంపెనీ, బయోలాజికల్ ఈ కొవిడ్ టీకా కార్బేవాక్స్, కొవిడ్-19 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. టీకా తయారీ ఇప్పటికే జరుగుతోందని, ఈ ఏడాది ముగింపు దశ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ 75కోట్ల మార్క్ను అధించగా.. వ్యాక్సినేషన్పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.