నర్సింహులపేట, జనవరి 25: ఆస్తి పంపకాల కోసం కొడుకులు ఘర్షణపడటం చూశాం.. కానీ, ఇక్కడ తండ్రి మృతదేహం సాక్షిగా కూతుళ్లే దహన సంస్కారాలు నిలిపేసి మరీ గొడవకు దిగారు. పెద్దమనుషుల జోక్యంతో చివరకు సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన యాద కమలమ్మ (90), నారాయణ (97) దంపతులకు ఐదుగురు కూతుళ్లు. అందరికి వివాహాలు చేశారు. చిన్న కూతురుకు విడాకులు కావడంతో తల్లిదండ్రులతోనే ఉంటున్నది. ఈ నెల 22న కమలమ్మ అనారోగ్యంతో మృతిచెందగా, చిన్న కూతు రు తలకొరివి పెట్టింది. ఈ క్రమంలో భార్య మరణం తట్టుకోలేక నారాయణ మంగళవారం మృతిచెందా డు. దహన సంస్కారాలు చేయాల్సిన కూతుళ్లు ఆస్తి పంపకాల కోసం తండ్రి మృతదేహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడవపడ్డారు. చివరికి గ్రామపెద్దలు జోక్యం చేసుకుని ఆస్తి పంపకాలు చేస్తామని ఒప్పందం చేసి కాగితాలు రాసివ్వడంతో గొడవ సద్దుమణిగింది. తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టి గొడవకు దిగిన కూతుళ్ల ప్రవర్తన చూసి గ్రామస్థులు చీదరించుకున్నారు. పైసలుంటే ఒక బాధ, లేకుంటే మరో బాధ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.