నా పేరు జీబీ.. పూర్తి పేరు ‘గిగా బైట్’.. ఫోన్ వాడేవాళ్లందరికీ సుపరిచితం. ఫోన్లో స్టోరేజీని చెప్పాలన్నా.. ఇంటర్నెట్ వాడకాన్ని కొలవాలన్నా.. నా పేరు తలుచుకోవాల్సిందే. ఇప్పుడు మీ ఫొన్లలో, ల్యాప్ట్యాప్లలో, కంప్యూటర్లలో రోజుకు జీబీలకు జీబీలు డాటా వాడేస్తున్నారు.
ఒకటి రెండు జీబీలతో మొదలైన మొబైల్ స్టోరేజీ కెపాసిటీ.. ఇప్పుడు టీబీల్లోకి (టెరాబైట్లు) వెళ్లిపోయింది. ల్యాప్ట్యాప్లు, సిస్టమ్ల సంగతి చెప్పనక్కర్లేదు. జీబీల సంగతే క్రమంగా మరిచిపోయే దశకు వచ్చేశాం. ఇప్పుడు నా విలువ కాస్త తగ్గింది.. కానీ ఒకప్పుడు నా స్థాయే వేరు. ఒకప్పుడు అంటే.. డిజిటల్ యుగం ప్రారంభం అయిన మొదటి రోజుల్లో నా వైభోగం ఎలా ఉండేదో తెలుసా? జీబీ అనే పదానికి చాలా విలువ ఉండేది. ఒక జీబీ డాటా కొనడం అంటే పెద్ద టాస్క్.. ఫోన్లోనో, ల్యాప్ట్యాప్లోనో ఒక జీబీ ర్యామ్ ఉంటే అదో గొప్పగా ప్రజలు చర్చించుకొనేవారు.
GIGABYTE | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నా ప్రస్థానం నాలుగు దశాబ్దాల కిందట మొదలైంది. అంతకుముందు అంతా కేబీ (కిలోబైట్లు), ఎంబీ (మెగాబైట్లు)లదే రాజ్యం. 1980లో ఐబీఎం కంపెనీ మొదటిసారిగా ఒక జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్ను అభివృద్ధి చేసింది. దానికి ‘ఐబీఎం 3380’ అని పేరు పెట్టారు. ఇప్పుడంటే చిన్న చిప్లోనే వందల జీబీలు పడుతున్నది కానీ.. నేను పుట్టినప్పుడు హార్డ్ డిస్క్ సైజ్ ఎంతుండేదో తెలుసా?.. ఒక ఫ్రిజ్ పరిమాణంలో ఉండేది. దాని బరువు ఎంతో ఊహించగలరా?.. ఏకంగా 250 కిలోలు. అప్పట్లో ఒక జీబీ హార్డ్ డిస్క్ విలువ 81 వేల నుంచి 1.42 లక్షల డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.67 లక్షల నుంచి రూ.1.18 కోట్లు అన్నమాట. కానీ ఇప్పుడు.. రెండుమూడు సెంటీమీటర్ల పరిమాణం ఉన్న చిప్లో వందట జీబీల డాటా పడుతున్నది.
నాలుగైదువందల రూపాయలు పెడితే పదుల జీబీ పెన్డ్రైవ్లు వస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ నా పరిమాణాన్ని, నా విలువను కుదించింది. ఇప్పుడు రూ.2-3వేలు ఖర్చు పెడితే 1టీబీ హార్డ్ డిస్క్ వస్తున్నది. అంటే వెయ్యి జీబీలు.. ఈ లెక్కన నా విలువ రూ.కోటి నుంచి రెండు రూపాయలకు పడిపోయింది. మొదట్లో హార్డ్ డిస్క్లకే పరిమితమైన నేను.. క్రమంగా ఫోన్లలోకి కూడా ప్రవేశించాను. మొదటిసారి 1 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఒక ఫోన్ ఎప్పుడు విడుదలైందో తెలుసా?. మొటరోలా సంస్థ 2011లో మొదటిసారి 1 జీబీ ఫోన్ను విడుదల చేసింది. అప్పుడు అదో సంచలనం. ఇప్పుడు కనీసం 6 జీబీ ర్యామ్.. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటేనే ఆ మ్తోన్నారు. డల్ వైపు కన్నెత్తి చూసు ధర తగ్గి.. వాడకం పెరిగింది.
నన్ను డాటా ట్రాన్స్ఫర్ను కొలిచేందుకు కూడా వాడుతారు. సులభంగా చెప్పాలంటే ఇంటర్నెట్ వేగం, వినియోగాన్ని కొలిచేందుకు కూడా వాడుతారని తెలిసిందే. నెట్ వాడాలంటే అందరూ డాటా ప్యాకేజీలు వేసుకుంటున్నారు కదా.. ఇప్పుడు సగటున కనీసం రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ వచ్చే ప్యాకేజీ వేసుకుంటున్నారు. సగటున ఇప్పుడు ఒక జీబీ డాటాకు చేస్తున్న ఖర్చు కేవలం రూ.9.94 మాత్రమే.. అంటే ఒక చాయ్కి చేసే ఖర్చుతో ఒక జీబీ డాటా వస్తున్నది. కానీ.. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా.. దశాబ్దం కింద నా విలువ తెలిస్తే మీరు నోరు వెళ్లబెట్టడం ఖాయం. 2014లో సగటున ఒక జీబీ డేటా ఖరీదు ఏకంగా రూ.269. దీంతో బంగారం కన్నా జాగ్రత్తగా నెట్ వాడిన రోజులవి. అప్పట్లో నెలకు సగటున ఎంత డాటా వాడేవారో తెలుసా.. 0.8 జీబీ. అంటే ఇప్పుడు ఒక్క రోజులో వాడే డాటా అప్పుడు నెలంతా వచ్చేది. ఇప్పుడు సగటున నెలకు 20 జీబీ వాడుతున్నారు. నా ధర తగ్గి.. వాడకం పెరిగిందన్నమాట.
నా ధర తగ్గింది.. వేగం పెరిగింది.. అందరూ జీబీలకు జీబీలు వాడుతున్నారు.. ఇదంతా బాగుంది.. మరి ఇదంతా ఎలా సాధ్యం అయ్యిందో కూడా తెలుసుకోవాలిగా.. శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్ను రేడియోలకు అందించే స్టేషన్ల మాదిరిగా.. మీకు ఇంటర్నెట్ను అందించేందుకు ‘బేస్ ట్రాన్స్-రిసీవర్స్ స్టేషన్’లు (బీటీఎస్) ఉంటాయి. ఇవి ఎంతగా పెరిగితే అంతగా ఇంటర్నెట్ కనెక్టివిటీ, వేగం పెరుగుతుంది. దశాబ్దం కిందట దేశంలో 6.49 లక్షల బీటీఎస్లు ఉంటే.. ఇప్పుడు ఏకంగా 25.42 లక్షలకు పెరిగాయి. అంటే నాలుగు రెట్లు పెరిగాయి. అందుకే ఇంటర్నెట్ కనెక్టివిటీ, వేగం పెరిగాయి. దశాబ్దం కింద డాటా వేగం 1.30 ఎంబీపీఎస్ (ఎంబీ పర్ సెకన్) ఉంటే.. ఇప్పుడు ఏకంగా 75.80 ఎంబీపీఎస్కు పెరిగింది. అంటే వేగం 70 రెట్లకుపైగా పెరిగింది. బీటీఎస్లు పెరుగడంతో దేశంలో 6.44 లక్షల గ్రామాలుంటే 6.16 లక్షల ఊళ్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పెరగడంతో యూజర్లు పెరిగారు. దశాబ్దం కింద ఇంటర్నెట్ను 25 కోట్ల మంది వాడితే ఇప్పుడు యూజర్ల సంఖ్య 88 కోట్లు దాటింది.
ఇంటర్నెట్, డాటా వినియోగం పెరగడంతో.. మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు అంటూ అందరూ డాటాను ట్రాన్స్ఫర్ చేయడం, నిల్వ చేయడం బాగా పెరిగిపోయింది. క్రమంగా నా పేరును మర్చిపోతున్నారు. నిల్వ సామర్థ్యం క్రమంగా ‘జీబీ’ల నుంచి టీబీల్లోకి మారిపోతున్నది. కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు ఎప్పుడో నన్ను విడిచిపెట్టి ‘టీబీ జనరేషన్’లోకి మారిపోయాయి.. ఇప్పుడు ఫోన్లు కూడా జీబీయన్ల నుంచి ‘టీబీయన్లు’గా మారిపోతున్నాయి. మరో నాలుగైదేండ్లలో నన్ను ర్యామ్ కెపాసిటీ కోసమే వాడుతారు. స్టోరేజీ రంగంలో నా కథ తుది దశకు చేరినట్టే. అయితే, ఇంటర్నెట్ స్పీడ్ గురించి చెప్పేటప్పుడు మాత్రం నా పేరు మార్మోగే రోజులు వస్తున్నాయి.. ఇప్పుడు స్పీడ్ ఎంబీపీఎస్లో ఉన్నది.. త్వరలో ‘జీబీపీఎస్’కు మారనున్నది. అప్పుడు మళ్లీ అందరూ నా నామస్మరణ చేయాల్సిందే.. ఇదీ నా ‘ఒక జీబీ’ కథ.