హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ సమరభేరి మోగించనున్నట్లు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్
పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారంరోజుల పాటు కాంగ్రెస్ చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట చేపట్టాలన్నారు.
వారంరోజుల పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 420 హామీల మోసంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెయ్యి రోజులైనా ఇప్పటివరకు నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ఎండగట్టి విస్తృతంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పితర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధమైందని, ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారంరోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందో, ఎన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ పరిపాలన సాగించిందో ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, లీగల్ సెల్ బాధ్యులు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.