రాఫెల్ రగడ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఈ వ్యవహారంపై సంచలనాత్మక కథనాలను వెలువరిస్తున్న ఫ్రెంచ్ పోర్టల్ ‘మీడియా పార్ట్’ తాజాగా మరో బాంబు పేల్చింది. ఒప్పందాన్ని దక్కించుకోవటానికి మధ్యవర్తి సుషేన్గుప్తాకు దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 1.3 కోట్ల యూరోలు (దాదాపు రూ.110 కోట్లు) చెల్లించిందనేదే ఆ కథనం సారాంశం. ఈ కుంభకోణంలో స్పష్టమైన సాక్ష్యాధారాలున్నా, దర్యాప్తు చేపట్టటానికి ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు ముందుకు రాలేదనేది మరింత సంచలనంగా మారింది. అయినా విపక్ష నాయకులపై ఈడీ, సీబీఐలను యథేచ్ఛగా ఉపయోగిస్తున్న మోదీ సర్కార్ రాఫెల్ ఆరోపణల విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయటం లేదు.
2007లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 126 రాఫెల్ విమానాలను కొనాలని ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్తో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఒక్కో విమానం ధరను రూ.526 కోట్లుగా నిర్ణయించి, 18 విమానాలను ఫ్రాన్స్లో తయారు చేయాలని, మిగతా 108 విమానాలను ప్రభుత్వరంగసంస్థ హెచ్ఏఎల్ భాగస్వామ్యంతో భారత్లోనే రూపొందించాలని నిర్ణయించారు. విధివిధానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆనాడు అడుగు ముందుకుపడలేదు. 2014లో మోదీ అధికారానికి వచ్చిన తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. కానీ ఒప్పందం స్వరూపమే మారిపోయింది. 126 బదులుగా 36 మాత్రమే కొంటామన్నారు. ఒక్కో విమానం ధరను ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచి రూ.1,670 కోట్లకు ఖరారు చేశారు. హెచ్ఏఎల్ బదులుగా అనిల్ అంబానీ కంపెనీ రిలయెన్స్ డిఫెన్స్ వచ్చి చేరింది. ఆ కంపెనీ వయసు అప్పటికి రెండు వారాలు మాత్రమే. దసాల్ట్తో చర్చలు జరిపే కమిటీకి బదులుగా ప్రధాని కార్యాలయమే రంగంలోకి దిగింది. ఒప్పందంలో ఉన్న అవినీతి వ్యతిరేక నిబంధనలను రద్దు చేసింది.
తొలి అంచనాను మించి విమానాల ధరను ఎందుకు పెంచవల సి వచ్చింది? హెచ్ఏఎల్ వంటి అనుభవం గల ప్రభుత్వరంగ సం స్థ ఉండగా, కొద్దిరోజుల కిందటే పెట్టిన అనిల్ అంబానీ కంపెనీకి ఎందుకు భాగస్వామ్యం ఇచ్చినట్టు? అనిల్ అంబానీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలేండ్ సన్నిహితురాలు, నటి జూలీ గేయెట్ సినిమాకు పెట్టుబడి సర్దడమేమిటి? మధ్యవర్తులే ఉండకూడదంటే, దళారీ సుషేన్గుప్తాకు డొల్ల కంపెనీల ద్వారా చెల్లింపులు ఎందుకు జరిగాయి? దేశ భద్రతతో ముడిపడిన ఈ ఒప్పందంపై తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయడం మోదీ ప్రభుత్వ బాధ్యత. బీజేపీ సర్కారు సమూ లంగా మార్చివేసిన ఈ ఒప్పందం కాంగ్రెస్ హయాం నాటిదని కమల నాథులు బుకాయించడం సమంజసంగా లేదు. ఈ వ్యవహారంలో వాస్తవాలు తేల్చి, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే అనుమానా లు మరింతగా బలపడటం ఖాయం.